విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ… ప్రస్తుతం సాగరతీర వాసుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్న అంశం.. ఆ ఎఫెక్ట్తో వైజాగ్ ప్రజలు బీజేపీపై రగిలిపోతున్నారు.. అదీకాక విభజన హామీలు అమలు చేయలేదని, విశాఖ రైల్వేజోన్ని నామమాత్రంగా మిగిల్చేస్తున్నారనే కోపం వారికి కేంద్రంపై ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ సీటుపై బీజేపీ నేత ఒకరు కన్నేసారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది… ఇంతకీ ఆ నేత ఎవరో? ఆయన లెక్కలేంటో మీరే చూడండి.
విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయాలని ఉవ్విళ్లుతున్నారంట బీజేపీ రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్ నరసింహారావు… మీడియా పులిగానే జనానికి పరిచయం అయ్యాడాయన.. తెలుగు వాడే అయినా బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కాని ఆయన పేరు ఏపీ వాసులకు తెలియలేదంటే అతిశయోక్తి కాదు..
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ప్రస్తుతం రాజ్యసభకు తెలుగేతర రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు… బీజేపీలో ఆయన జాతీయ నాయకుడు…. ఏడాదిన్నరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ఆయన పావులు కదుపుతున్నారంట… ఇందులో భాగంగా విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బరిలో నిలవాలని జీవీఎల్ నరసింహారావు ఆసక్తి చూపుతున్నారంట.
ఈ విషయాన్ని జీవీఎల్ బీజేపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. అందుకే ఆయన పదేపదే విశాఖలో పర్యటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది … కాపునాడు ఆహ్వానాన్ని మన్నించి ఆయన వైజాగ్లో నిర్వహించిన కాపుల సభలో పాల్గొనడం వెనుక జీవీల్ పక్కా వ్యూహం దాగి వుందంటున్నారు…. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు ఎక్కువని, వారికి ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారానికి చొరవ చూపానని ఆయన చెప్పుకుంటున్నారు
విశాఖ ఆర్కే బీచ్లో దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవీఎల్ డిమాండ్ చేశారు … అలాగే కాపుల రిజర్వేషన్ అంశంపై రాజ్యసభలో పదేపదే ప్రశ్నిస్తూ.. వారి మనసు చూరగొనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు… వంగవీటి మోహనరంగా పేరును ఎందుకని ఒక జిల్లాకు పెట్టలేదని ఆయన ప్రశ్నిస్తూ… కాపుల కేంద్రంగా జీవీఎల్ నరసింహారావు రాజకీయం చేస్తున్నారు.
ఏదేమైన విశాఖ ఎంపీగా పోటీ చేసే క్రమంలో జీవీఎల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే ప్రచారం ఆసక్తికరంగా మారింది …. విశాఖ నుంచి స్థానికేతరులు లోక్సభకు ఎక్కువగా ఎన్నికవుతూ వస్తున్నారు … అలాగే విశాఖలో భూకుంభకోణాలపై జీవీఎల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే… విశాఖలో భూఆక్రమణల దారుల భరతం పడతానని ఆయన హెచ్చరించడం వెనుక రాజకీయం కోణమే ఉందంటున్నారు … అయితే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిర్ణయించి, విశాఖ రైల్వే జోన్ను నామ్ కే వాస్తేగా మార్చిన పార్టీ తరపున పోటీ చేస్తే… ఆ వ్యతిరేకతను జీవీఎల్ ఎలా తట్టుకుంటారో చూడాలి… చూడాలి జీవీఎల్ అదృష్టం ఎలా ఉండబోతుందో?