పండగ సరుకుల పేరుతో మోసం.. రూ.4 కోట్లతో వాలంటీర్ ఉడాయింపు.
సంక్రాంతి పండగకు సరుకులు ఇప్పిస్తానని చీటీలు కట్టించిన వాలంటీర్ మోసానికి పాల్పడింది.
ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బాధితులకు కుచ్చు టోపి పెట్టింది.
విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.
★ విజయనగరం జిల్లాలో ఓ వాలంటీర్ చీటీల పేరుతో 1250 మందికి టోకరా వేసింది.
★ గుర్ల మండలం ఎస్ఎస్ఆర్పేటకు చెందిన పతివాడ శ్రీలేఖ నెలిమర్ల మండలం కొండగుంపాం గ్రామ సచివాలయంలో వాలంటీర్గా పని చేస్తోంది.
★ ఎస్ఎస్ఆర్పేటలో నెలకు రూ.300 చొప్పున వసూలు చేసింది. ఏడాదంతా కడితే సంక్రాంతి పండగకు సరిపడా సరకులు ఇస్తానని నమ్మబలికింది.
★ ఈ సరుకులలో బియ్యం మొదలుకుని పప్పుల వరకు పండగకు ఉపయోగపడే సామన్లు ఉంటాయని తెలిపింది.
★ నిజమని నమ్మిన చాలామంది చీటీలు కట్టేందుకు ముందుకు వచ్చారు.
★ శ్రీలేఖతో పాటు కొండకరకాం గ్రామంలో ఉండే ఆమె మేనమామ కుమారుడు మజ్జి అప్పలరాజు కూడా ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాడు. ఆయన పలువురు ఏజెంట్లను ఏర్పాటు చేసి మరీ చీటీలు కట్టించాడు.
★ క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రిస్టియన్లు తమకు పండగ సామాగ్రి ఇవ్వాల్సిందిగా వారిని కోరారు.
★ రేపు, మాపు అంటూ నిర్వాహకులు తప్పించుకుని తిరిగారు. వారి వద్ద నుంచి ఒత్తిడి పెరగడంతో నిర్వహకులు పరారయ్యారు.
★ మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
★ దాదాపు 4 కోట్ల రూపాయల దాకా వసూలు చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.
★ “మా ఇంటి పక్కనే ఉంటూ మోసానికి పాల్పడింది. నాతో పాటు నా మిత్రుల దగ్గరి నుంచి చీటీలు కట్టించింది. నాకు తెలిసిన వారందరి చేత నేను కట్టించాను. ఇప్పుడు వాళ్లందరూ నన్ను అడుగుతున్నారు. నెలనెలా వసూలు కాకపోతే సరకులు రావని చెప్పేది.” అని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు.